Sarfira Movie: ‘ ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం.. మా సినిమాకు రండి’.. ఆడియెన్స్‌కు మల్టీప్లెక్స్‌ల ఆఫర్

www.mannamweb.com


బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల పరంగా ఈ మధ్యన వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ వరుసగా బోల్తా పడుతున్నాయి. అలా తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సర్ఫిరా’ విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పేలవమైన వసూళ్లను రాబడుతోంది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు అసలు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు మల్టీప్లెక్స్‌లు ఉచితంగా టీ, సమోసాలు అందించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా మొదటి రోజు స్టార్ సినిమాలు బాగా కలెక్ట్ చేయాలి. కానీ ‘సర్ఫిరా’ సినిమా తొలిరోజు (జూలై 12న) కేవలం రూ.2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు రూ.4.50 కోట్లు రాబట్టింది. ఎలాగైనా ఆదివారం (జూలై 14) సినిమా కలెక్షన్లను మరింత పెంచాలన్నది చిత్ర బృందం లక్ష్యం. అందుకోసం మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు టీ, సమోసాలను ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సర్ఫిరా సినిమా చూసేందుకు వచ్చే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు అందులో ప్రకటించింది.

సుధా కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ‘సర్ఫిరా’. కాగా ఇది తమిళ చిత్రం ‘సురారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే హద్దురా)కి హిందీ రీమేక్‌. ఆ తమిళ సినిమా గతంలో హిందీలోకి డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్లీ హిందీలో రీమేక్ చేయడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కథ అందరికి తెలిసిపోవడంతో ‘సర్ఫిరా’ సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపడం లేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కెప్టెన్ గోపీనాథ్ పాత్రను అక్షయ్ కుమార్ పోషించాడు. పరేష్ రావల్, దిశా మదన్, ప్రకాష్ బెలవాడి తదితరులు నటించారు. కోలీవుడ్ నటుడు సూర్య అతిథి పాత్రలో కనిపించారు. అయినా కూడా ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది.