Andhra news: ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితోపాటుగా కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్‌ విద్యార్థులకు సైతం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,08,619 మంది, ద్వితీయ సంవత్సరంలో 92,134 మంది విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.

ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్‌ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు వెలువరించింది. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా చూడాలని సమగ్ర శిక్ష డైరెక్టర్‌కు సూచించింది. జులై 15 నాటికి విద్యార్థులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.