ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం.. కొత్త వేతన సంఘం తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు 7వ వేతన సంఘం అమల్లో ఉండగా.. త్వరలో అందుబాటులోకి రానున్న 8వ వేతన సంఘం కోసం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ ఉద్యోగులకు కనీస జీతం.. పెన్షనర్లకు కనీస పెన్షన్ భారీగా పెరుగుతుందని చెప్పొచ్చు. సాధారణంగా.. ఈ ఏడాది చివరికల్లా ప్రస్తుత వేతన సంఘం గడువు ముగుస్తున్నా.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ వేతన సంఘానికి సంబంధించి.. ప్యానెల్ కూడా ఏర్పాటు చేయలేదు. వేతన సంఘం ఏర్పాటును జనవరిలోనే ప్రకటించినప్పటికీ.. ఇంకా కమిటీని నియమించలేదు. విధివిధానాలు ఖరారు చేయలేదు.
సాధారణంగా కమిషన్ ఏర్పాటైన తర్వాత.. రిపోర్ట్ సమర్పించేందుకు 12-18 నెలల వరకు సమయం పడుతుంది. ప్రభుత్వం సదరు సిఫార్సుల్ని సమీక్షించి.. ఆమోదించి.. అమలు చేసేందుకు మరో ఏడాది పట్టొచ్చు. దీంతో రెండేళ్ల వరకు కొత్త వేతన సంఘం అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎప్పుడు అమల్లోకి వచ్చినా కూడా.. జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెన్షనర్లకు.. కనీస పెన్షన్ రూ. 9 వేలుగా ఉండగా.. 8వ వేతన సంఘం కింద దీనిని నెలకు రూ. 25 వేలకు చేర్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. దాదాపు ఇది ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రిపోర్ట్స్ కూడా ఇంతే పెరగాలని సూచిస్తున్నాయి.
ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్కు అర్హత పొందే సర్వీస్ కాలాన్ని.. 15 ఏళ్ల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని మరో ముఖ్యమైన వాదన వినిపిస్తోంది. ఈ సంస్కరణ కూడా దాదాపు ఖరారైందని తెలుస్తోంది. దీంతో పూర్తి పెన్షన్కు ప్రస్తుతం ఉన్న సమయం కంటే కాస్త ముందుగానే తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. పెన్షన్ ప్రాసెసింగ్ను మరింత సులభతరం చేసేందుకు.. పారదర్శకత పెంచేందుకు.. యూపీఎస్ను సరళీకృతం చేయాలని కేంద్రం చూస్తోంది.
జీతభత్యాల్ని నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈసారి ఇది 1.83- 2.46 మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత కనీస జీతం, పెన్షన్పై ఎన్ని రెట్లు ఉంటుందో చెబుతుంది. దీంతో ఉద్యోగులకు టేక్ హోం శాలరీ పెరుగుతుంది. ఇంకా ఇదే సమయంలో అధిక గ్రాట్యుటీ చెల్లింపులు, పెద్ద మొత్తంలో ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనిని కేంద్రం ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది.






























