మారుతున్న జర్మనీ యుద్ధ తంత్రం.. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి

ఐరోపా దేశాలు రెండు ప్రపంచ యుద్ధాలను చవిచూశాయి. ఈ మహాయుద్ధాలకు కేంద్రంగా ఉన్న జర్మనీ ఆ తరువాత శాంతిమంత్రం పఠించింది. జర్మనీ నేతల్లో రక్షణ రంగంపై అనాసక్తి పెరిగింది. ఫలితంగా కొత్త తరం ఆయుధాల ఉత్పత్తి, అభివృద్ధికి అక్కడి ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వలేదు. తమ రక్షణావసరాల కోసం అమెరికాపైనే అధికంగా ఆధారపడింది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆపై ట్రంప్ అధికారంలో రావడం కారణంగా తమ రక్షణ బాధ్యతలను తామే చేపట్టేందుకు జర్మనీ మరోసారి సిద్ధమైంది. సంప్రదాయక ఆయుధాలతోపాటు కొత్త తరం ఆయుధ, నిఘా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల తయారీలో అంకుర సంస్థలను విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది.


హెల్సింగ్, ఏఆర్‌ఎక్స్ రోబోటిక్స్ వంటి అంకుర సంస్థలకు జర్మనీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తోంది. వాటికి నిధుల లభ్యతను కూడా పెంచుతోంది. హెల్సింగ్ మార్కెట్ విలువ ఇటీవల 12 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. అమెరికా అణ్వాయుధాన్ని కనుగొన్న రీతిలో అత్యాధునిక కొత్తతరం ఆయుధాలతో యుద్ధ తంత్రాన్ని మార్చేసే దిశగా జర్మనీ అడుగులు వేస్తోంది.

రక్షణ రంగంలోని సంప్రదాయక సంస్థలతో పాటు స్టార్టప్ సంస్థలను ప్రోత్సహంచేందకు జర్మనీ ప్రభుత్వం వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టంది. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల జారీని మరింత సులభతరం చేసింది. అత్యాధునిక యుద్ధ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్ సంస్థలను ప్రభుత్వంతో వీలున్నంతగా అనుసంధానం చేయాలంటూ అధికారులను జర్మనీ ఛాన్సలర్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు నిబంధనలను మరింత సరళీకరించారు. ఐరోపా వెలుపల ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గనకుండా నిషేధించారు.

ఈ క్రమంలో జర్మనీ స్టార్టప్ సంస్థలు కొత్త తరహా ఆయుధాలను సిద్ధం చేస్తున్నాయి. అత్యాధునిక సెన్సార్లు అమర్చిన బొద్దింకలతో నిఘా కార్యకలాపాలు నిర్వహించే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దిశగా స్వార్మ్ బయోటాక్టిక్స్ వంటి ప్రాజెక్టులకు జర్మనీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కీటకాలపై కెమెరాలను అమర్చి యుద్ధ క్షేత్రంలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.