ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ మంజూర్ చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్లలో పింఛన్ డబ్బుల్ని జమ చేస్తోంది.
అలాగే ఒకటో తేదీ సెలవు దినం అయితే.. ముందురోజే పింఛన్ పంపిణీ చేస్తోంది. అలాగే స్పౌజ్ కేటగిరిలో పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పింఛను తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.
ఈ మేరకు ప్రభుత్వం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌజ్ పింఛను కింద నెలకు రూ.4,000 ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి వారికి ఈ డబ్బులు అందజేస్తారు. సుమారు 89,788 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడుతుంది. జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు పింఛను ఈ పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం వితంతువు పింఛన్ల మంజూరును ఆపివేసింది..
ఆ తరువాత ఎన్నికలు రావడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై దృష్టి సారించింది. భర్త చనిపోతే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి సహాయం చేయాలని నిర్ణయించింది.
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి లబ్ధిదారుల జాబితాను పంపించారు. అర్హులైన వారి నుంచి పత్రాలు స్వీకరించి సెర్ప్ వెబ్సైట్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛనుకు అర్హులైన వారి జాబితాను తయారు చేశారు. కూటమి ప్రభుత్వం గత నెల 24న స్పౌజ్ పింఛను పథకాన్ని ప్రారంభించింది.
మరణించిన వ్యక్తి వివరాలు, మరణ ధ్రువపత్రం, భార్య వివరాలను సచివాలయంలో అందజేసి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. 2024 నవంబరు నుంచి మరణించిన వారి భార్యలకు కూడా ఈ పింఛను వర్తిస్తుంది.అయితే, కొన్ని దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ‘ముందుగానే భార్య పింఛను పొందడం, భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడం, హౌస్హోల్డ్ మ్యాపింగ్లో భార్యాభర్తలు ఇద్దరూ ఒకేచోట లేకపోవడం, మరణ ధ్రువపత్రం అందించకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండడం, అందుబాటులో లేకపోవడం, సాంకేతిక కారణాలు, భార్య మళ్లీ పెళ్లిచేసుకోవడం’ వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. పింఛన్ దరఖాస్తుకు సంబంధించి.. తిరస్కరణకు గల కారణాలను ప్రతి దరఖాస్తుకు జత చేశారు. ఇకపై భర్త చనిపోయిన భార్యలకు ఆ మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
































