- కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం
- ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు
- వాహనం కొనుగోలు చేసిన షోరూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్
ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్..
ఇప్పటివరకు ఉన్న విధానంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. మళ్లీ నెంబర్ ప్లేట్ కోసం డీలర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తోంది. ఈ పద్ధతితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేలా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది ప్రభుత్వం. వాహనం కొన్న షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేట్ నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త విధానం అమలు కానుంది. వాణిజ్య (కమర్షియల్) వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం ఎప్పటిలానే ఆర్టీవో కార్యాలయాల్లోనే జరుగుతాయి.
కొత్త విధానం అమల్లోకి వస్తే షోరూమ్లోనే కొనుగోలుదారుడి వివరాలను వాహన్ పోర్టల్లో డీలర్ నమోదు చేస్తారు. రవాణశాఖ అధికారి డిజిటల్ అనుమతి ఇచ్చిన వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కేంద్ర రోడ్డు రవాణ, రహదారి మంత్రిత్వశాఖ పరిధిలోని వాహన్-సారథి పోర్టల్స్ ద్వారా షోరూమ్లలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.




































