ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హల్చల్ రేపిన తాజా పరిణామం జీవీ రెడ్డి (GV Reddy) రాజీనామా. ఫైబర్నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవిని కూడా ఆయన వదిలేశారు.
అన్ని పదవులకు గుడ్బై చెబుతూ, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నానని స్పష్టంగా ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
జీవీ రెడ్డి కొంతకాలంగా టీడీపీ (TDP) కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు. తన స్వరంతో, అభిప్రాయాలతో పార్టీకి మద్దతు ఇస్తూ ముందుండేవారు. అయితే ఇటీవల పరిస్థితులు మారడంతో రాజకీయాలపై దృష్టి తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన న్యాయవాద వృత్తికి పూర్తి స్థాయి సమయం కేటాయించాలని భావించడం వెనుక ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా జీవీ రెడ్డి తన వ్యక్తిగత, వృత్తి జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టినట్లయింది.
జీవీ రెడ్డి సరికొత్త జర్నీ ప్రారంభించారు
ఈ క్రమంలో జీవీ రెడ్డి సరికొత్త జర్నీ ప్రారంభించారు.. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. యువతకు ఆహ్వానం పలుకుతూ ట్వీట్ చేశారు జీవీ రెడ్డి.జీవీ రెడ్డి అండ్ కో , అడ్వకేట్స్ సంస్థ విస్తరిస్తోంది. న్యాయవాద పట్టభద్రులు (Law graduates) (LLB పూర్తి చేసిన వారు), 0 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఈ సంస్థలో చేరవచ్చు. ‘ఖచ్చితత్వం, నిజాయితీ, ప్రభావవంతమైన వ్యాజ్యంతో నిర్మించబడిన’ సంస్థలో భాగం అవ్వండి.
ఇది ఒక మంచి అవకాశం’ అంటూ జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. యువ లాయర్లకు ఇది మంచి అవకాశం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీవీ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.జీవీ రెడ్డి తన రాజీనామా తర్వాత ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది.
నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను
తక్కువ కాలంలోనే టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత’ అంటూ ఆకాంక్షించారు.జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఉద్యోగులను తొలగించినా దినేష్ కుమార్ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీకి సహకరించేలా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల సంస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ క్రమంలో తర్వాత పరిణామాలతో జీవీ రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. జీవీ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
































