ఖైరతాబాద్ వినాయకుడి వద్ద పోకిరిల అసభ్య ప్రవర్తన.. 900 మంది అరెస్ట్

తెలంగాణలో వినాయక చవితి అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Maha Ganapati). ఈ భారీ వినాయకుడిని చూసేందుకు నవరాత్రుల్లో లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ వస్తుంటారు.


ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరిల ఆటలు కట్టించేందుకు సీసీ కెమెరాలతో పాటు, షీ టీమ్ బృందాలు (She Teams) మఫ్టీలో రంగంలోకి దిగాయి. దీంతో గడిచిన ఏడు రోజుల్లో.. ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంతంతో పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో..

యువతులను, మహిళలను అసభ్యంగా తాకుతూ రెచ్చిపోతున్న పోకిరిలకు షీ టీమ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద 7 రోజుల్లో 900 మందిని అరెస్టు (900 people arrested) చేసినట్లు ప్రకటించింది. వారిలో 55 మంది మైనర్లను రెడ్ హ్యాండెడ్‌గా షీ టీమ్స్ పట్టుకున్నాయి. అలాగే రేపు, ఎల్లుండి, రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే నిమజ్జన కార్యక్రమంలో కూడా షీ టీమ్స్ యాక్టీవ్ గా ఉంటాయని, యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.