భారీ స్కాం.. హైటెక్ సిటీలో ఆఫీస్ కూడా ఎత్తేశారు.. ఒక్క హైదరాబాద్లోనే రూ.850 కోట్లకు దెబ్బేశారు..!

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది. చిన్న పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.


హైదరాబాద్‌లోనే ఫాల్కన్ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదేలును చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా 6,979 మంది బాధితుల నుంచి రూ.17 వేల కోట్లు వసూలు చేసిన ఈ భారీ మోసం గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. బ్రిటానియా, గోద్రేజ్, అమెజాన్ వంటి కంపెనీలలో పెట్టుబడుల పేరుతో మోసం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫాల్కన్‌తో అనుబంధంగా ఉన్న 14 కంపెనీలు ఏర్పాటయ్యాయి మరియు ఈ వసూళ్లు జరిగాయి.

ఇదిలా ఉండగా.. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ (FID)కి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు ఇప్పటికే దుబాయ్‌కు పారిపోయారు. ఈ ముగ్గురిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.

ఈ కంపెనీకి చెందిన మొత్తం 20 మందిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కంపెనీకి చెందిన ఆరుగురు ఉద్యోగులు భారతదేశంలో ఉన్నారని, వారి కోసం వెతుకుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ FID కంపెనీ బిజినెస్ హెడ్ పవన్‌ను శనివారం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

FID కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఒకరు అమర్‌దీప్ కుమార్, మరొకరు వి. కావ్య. మిగిలిన వారందరూ కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. పోలీసులు అమర్‌దీప్ కుమార్ పేరును A1గా, కావ్య పేరును A2గా చేర్చారు. ఈ FID కంపెనీ మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడిదారుల నుండి డబ్బు వసూలు చేసింది.

ఈ కంపెనీ కనీసం 15 రోజులు మరియు గరిష్టంగా ఆరు నెలలు పెట్టుబడి పెట్టవచ్చని పెట్టుబడిదారులను ఒప్పించింది. కొన్ని నెలలు పెట్టుబడిదారులకు లాభాలు చూపించింది. పెద్ద మొత్తంలో వసూలు చేసినప్పుడు అది టోపీ పెట్టింది. ఈ కంపెనీ కార్యాలయం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉంది. ఈ కంపెనీ జనవరి 10 నుండి పెట్టుబడిదారుల నుండి డబ్బును దుర్వినియోగం చేస్తోంది.