గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తిరిగొచ్చి..

www.mannamweb.com


గాంధీనగర్‌: ఓ ఐఏఎస్‌ అధికారి భార్య (IAS Officer Wife) పక్కదారి పట్టింది. తనకు పరిచయమైన గ్యాంగ్‌స్టర్‌తో కలిసి నేరాలకు పాల్పడింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె భర్త విడాకులకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకొని ఇంటికి తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..

గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రణ్‌జీత్‌కుమార్‌ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌ (Gangster)తో పరిచయం ఏర్పడింది. తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్‌స్టర్‌తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. వీరిద్దరూ కలిసి జులై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటినుంచి గ్యాంగ్‌స్టర్‌, సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్‌లోని తన భర్త రణ్‌జీత్‌కుమార్‌ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్‌ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విషం తాగిన సూర్య జై 108కు ఫోన్‌ చేసింది. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనపై రణ్‌జీత్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘‘ఐఏఎస్‌ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రణ్‌జీత్‌ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా.. ఆమెను లోనికి అనుమతించొద్దని పనివాళ్లకు చెప్పి ఆయన విడాకుల కేసు పనిమీద బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది’’ అని తెలిపారు. కాగా.. ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం.