గణేషుడికి 5 తులాల బంగారం వేసి మర్చిపోయి నిమజ్జనం

వినాయక చవితి వేడుకలు దేశమంతటా సందడిగా జరిగాయి. చాలామంది తమ ఇళ్లలో గణపయ్యను ప్రతిష్ఠించుకుని, అలంకారాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, నిమజ్జనం సమయంలో జరిగిన ఒక సంఘటన హైదరాబాద్‌లోని ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.


5 తులాల బంగారు గొలుసు.. గణపయ్య మెడలో మరిచిపోయారు

హైదరాబాద్, వనస్థలిపురంలోని హస్తినాపురం హోమ్ ప్రసాద్ అపార్ట్‌మెంట్‌లో నివసించే గిరిజ అనే మహిళ తన ఇంట్లో గణపతిని ప్రతిష్టించి, ప్రత్యేకంగా అలంకరించింది. స్వామివారికి తన కుటుంబానికి చెందిన 5 తులాల బంగారు గొలుసును వేసి మూడు రోజుల పాటు పూజలు చేసింది. భక్తి పారవశ్యంలో ఉన్న ఆ కుటుంబం, నిమజ్జనం కోసం విగ్రహాన్ని తుర్కయాంజాల్ మాసబ్ చెరువుకు తీసుకెళ్లింది.

కంగారులో బంగారం గొలుసును తీయడం మర్చిపోయిన ఆ కుటుంబం, నిమజ్జనం పూర్తి చేశాక విషయం గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండెలు ఆగినంత పనై, బోరున ఏడుస్తూ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సిబ్బందిని ఆశ్రయించారు.

గణపయ్య దయ.. బంగారు గొలుసు తిరిగి లభ్యం

ఆ కుటుంబం బాధను చూసిన మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. జేసీబీలతో ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో నిమజ్జనమైన వినాయక విగ్రహాలను పక్కకు జరిపి, గంటల తరబడి శ్రమించి చివరికి ఆ కుటుంబం విగ్రహాన్ని బయటకు తీశారు. ఆశ్చర్యకరంగా, విగ్రహం మెడలో ఉన్న బంగారం గొలుసు సురక్షితంగా ఉంది. సిబ్బంది దాన్ని ఆ కుటుంబానికి తిరిగి అప్పగించగా, ఆనందంతో వారికి కన్నీళ్లు ఆగలేదు.

పోయింది అనుకున్న బంగారం తిరిగి దొరకడంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. “ఆ వినాయకుడే మళ్లీ మాకు దాన్ని ఇప్పించాడు. ఇది ఆయన లీల” అంటూ మున్సిపాలిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నిమజ్జనం చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.