చేసిన పాపాల నుంచి జగన్, ఆయన బ్యాచ్ తప్పించుకోలేరు: మంత్రి గొట్టిపాటి

www.mannamweb.com


అమరావతి: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాలిపోయిన ఘటనకు విద్యుదాఘాతం కారణం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చేసిన పాపాలు తుడిచిపెట్టేందుకు వైకాపా నేతలు వరుస కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో వైకాపా ఆరితేరిన పార్టీ అని.. అది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండగా నెల్లూరు కోర్టులోనే దస్త్రాలు దొంగతనం చేయించారని ఆరోపించారు. అధికారం పోయాక యనమలకుదురు కరకట్టపై దస్త్రాలు తగులబెడుతుంటే ప్రజలే వెంబడించి పట్టుకున్నారని తెలిపారు.

ఇప్పుడు మాజీ మత్రి పెద్దిరెడ్డి పాపాలు మాయం చేసేందుకే మదనపల్లెలో దస్త్రాలు తగలపెట్టించారని మంత్రి ఆరోపించారు. సాక్ష్యాల మాయం కేసులకు సంబంధించి జరుగుతున్న వరుస ఘటనలన్నింటిలో వైకాపా కుట్రలు బహిర్గతమవుతున్నాయన్నారు. చేసిన పాపాల నుంచి జగన్, ఆయన బ్యాచ్ తప్పించుకోలేరని హెచ్చరించారు. నేరస్థులు ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు.