ఊహించని సీన్… జగన్‌-రఘురామకృష్ణరాజు మాటామంతి

www.mannamweb.com


ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీసీ అధినేత జగన్‌ దగ్గరకు వెళ్లి పలకరించారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాలపాటు మాటామంతీ జరిగింది. ఇరువురి భేటీ.. ఆసక్తికర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తన కేసులో ఎవరెవరికి ఫోన్లు వెళ్లాయో గూగుల్‌ టేక్‌అవుట్‌ వివరాలు సేకరించాలని పోలీసు శాఖను ఆయన కోరుతున్నారు. గతంలో వైసీపీ రెబల్ ఎంపీగా ఉండి.. జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఉండి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. నిన్నమొన్నటివరకు కూడా జగన్‌పై ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ స్వయంగా జగన్ వద్దకే వెళ్లి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా మొదలయ్యాయి. కొత్త ప్రభుత్వ లక్ష్యాలు, ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని దాటుకుని అభివృద్ధి దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్లేలా ప్రభుత్వ కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు గవర్నర్‌. అటు.. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఆ ప్రసంగం నిరసిస్తూ YCPఎమ్మెల్యేల వాకౌట్ చేశారు.