వైసీపీ కార్యాలయాల కూల్చివేత పై హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత కొత్త రాజకీయం మొదలైంది. సీఆర్డీఏ పరిధిలో వైసీపీ కార్యాలయం ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారంటూ అధికారులు ఆ భవనం కూల్చేసారు.


అదే విధంగా జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలు నిబంధలనకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నారంటూ నోటీసులు జారీ చేసారు. దీని పై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ చేసిన రాష్ట్ర హైకోర్టు ఈ వ్యవహారం పైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

కార్యాలయాల వివాదం

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వంలో నాటి పాలకులకు మద్దతుగా పని చేసిన అధికారులను బదిలీ చేసింది. గత ప్రభుత్వ పథకాల పేర్లను మార్పు చేసింది. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమ పార్టీ కార్యాలయాల కోసం అధికార దుర్వినియోగం చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా సీఆర్డీఏ పరిధి లో ప్రభుత్వం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారంటూ ఆ భవనం అధికారులు కూల్చివేయటం రాజకీయంగా కలకలం రేపింది.

హైకోర్టులో పిటీషన్

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెద్ద ఎత్తున పార్టీ కార్యలయాలను భారీ భవనాలుగా నియమించటం పైన టీడీపీ టార్గెట్ చేసింది. దీంతో..రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేయబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్దమైందని వైసీపీ పేర్కొంది. అయితే తాను ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానంటూ ప్రభుత్వం తరుపున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలిపారు.

స్టేటస్ కో ఉత్తర్వులు

దీని పైన ప్రభుత్వం తరుపు న్యాయవాదులు స్పందించారు. తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామని తెలిపారు. దీంతో కేసు విచారణ రేపటికి (గురువారం) వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అప్పటివరకు యథాతథ స్థితిని పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి వాదనలు విన్న తరువాత న్యాయస్థానం ఈ భవనాల నిర్మాణాల పైన తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.