Amaravati Real Estate: అమరావతి భూముల ధరలకు రెక్కలు, దాదాపు పది రెట్లు పెరిగిన ల్యాండ్ రేట్లు

Amaravati Lands for Sale: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత అయిదేళ్లుగా చతికిలపడిన భూముల రేట్లు కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో రాజధాని ఆశలతో తిరిగి పుంజుకున్నాయి.


నిజం చెప్పాలంటే 2023 డిసెంబరు నెల నుంచే తిరిగి చంద్రబాబే ముఖ్యమంత్రి కానున్నారనే టాక్ రావడంతో నిర్జీవమైన భూముల ధరల్లో చలనం కనిపించింది.

మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభుత్వం తెరపైకి తేవడంతో.. ఏపీ రాజధాని అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు దాదాపు నాలుగేళ్లపాటు నేల చూపులు చూశాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలు దాదాపు మూతపడే పరిస్థితికొచ్చాయి. భూములు కొనుగోళ్ల పరిస్థితి అటుంచితే.. కనీసం అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు వైపు సైతం చూసేవారు లేని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని నెలల నుంచి పరిస్థితిలో మార్పు కనిపించింది. వైసీపీ ప్రభుత్వంపై రాజధాని అమరావతి ప్రజల్లో కూడగట్టుకున్న వ్యతిరేకత సైతం కూటమికి ఓటు వేసేలా చేసింది. చంద్రబాబు చేతికి తిరిగి పగ్గాలొస్తాయన్న భావించి, చంద్రబాబు సీఎం అయితే అమరావతినే రాజధానిగా అభివృద్ది చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ధరలు పెరిగేలా చేయడానికి కారణమైంది.

ఆరు నెలల్లో పది రెట్లకు పైగా..

గడిచిన ఆరు నెలల్లో అమరావతి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర గ్రామాలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు తదితర ప్రాంతాలు, తాడేపల్లి మండలం లోని పెనుమాక, ఉండవల్లి తదితర ప్రాంతాల్లో మొన్నటి వరకు రూ. 3,500 నుంచి రూ.4,000 వరకు ఉన్న గజం భూమి ఏకంగా రూ.45 వేలకు చేరిపోయిందని ఇక్కడి రియల్టర్లు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి కొనాలంటే 15 నుంచి 20 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సమీపంలోని గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లోనూ రియల్ వ్యాపారాలు పుంజుకున్నాయి. ఈ నెల ఒకటో తేదీ వరకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు రూ.40 లక్షల నుంచి 45 లక్షల మధ్య ఉండగా ఇప్పుడు 50 లక్షలు పైమాటే పలుకుతున్నాయంటున్నారు. నిర్మాణంలో ఉన్నవాటిని హాట్ కేకుల్లా అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా రియల్టర్ల హడావుడి, ప్రాంతాన్ని బాగుచేస్తోన్న కార్మికుల గలగలతో సందడి వాతావరణం నెలకొంది.

తీర్పుతో పునరుత్తేజం

జూన్ 4న కూటమికి విజయాన్ని అందిస్తూ ఎన్నికల ఫలితాలు రావడంతో.. అమరావతి ప్రాంత రైతులు, ప్రజల ఆశలు, కలలు నిజమయ్యాయి. దాదాపు 1600 రోెజులకు పైగా సుదీర్ఘంగా సాగిన అమరావతి రాజధాని ఉద్యమానికి తెరపడినట్లయింది. సరికొత్త ఆశలతో రాజధాని ప్రాంతమంతా ఊపిరి తీసుకుంది. అమరావతి ప్రాంతంలో కూటమి గెలుపు దరిమిలా నేతల నుంచి సంకేతాలు వెళ్లడంతో అధికారులు బాగుచేత పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు బట్టిపోయిన పరికరాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తుమ్మచెట్లు కొట్టేస్తూ రహదారులు సైతం నిర్మిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో రాజధాని అంశంపై ఆయన చేసే ప్రకటనలతో ఈ బూమ్ మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న ఇసుక విధానంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ముఖ్యంగా తొలివారంలోనే కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై సమీక్షించే అవకాశముందని భావిస్తున్నారు.

అటూ ఇటూ వంద కిలోమీటర్ల పరిధిలో.. రియల్ పండగే..

తాజా పరిస్థితుల గతంలో రియల్ పెట్టుబడి పేరెత్తితే గతంలో హైదరాబాద్ వైపు చూసిన పెట్టుబడిదారులంతా ఇప్పుడు గుంటూరు, విజయవాడ పరిసరాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా రియల్ బూమ్ ఊహించని విధంగా ఊపందుకుంది. కేవలం రాజధాని ప్రాంతమే కాకుండా.. రాజధాని ప్రాంతమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకే రియల్ బూమ్ పరిమితం కాకుండా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలపై ప్రభావం పడే అవకాశముందని రియల్ రంగ నిపుణులంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ తేడా కనిపించకపోయినా రానున్న రెండు మూడు నెలల్లో ధరలు విపరీతంగా పెరుగుతాయని చెబుతున్నారు.

శరవేగంగా అభివృద్ధి పనులు

రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకూ రాత్రుళ్లు చీకటిగా ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు ఇప్పుడు విద్యుత్తు వెలుగులతో తళతళలాడుతోంది. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకూ ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్తు వెలుగులు పునరుద్ధరించేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో సోమవారానికే సీడ్ యాక్సిస్ రోడ్డంతా విద్యుత్తు వెలుగులు సంతరించుకుంది. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు.