మ్యాన్‌ ఈటర్‌గా మారిన చిరుత..! ముగ్గురిని చంపేసింది.. రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ఆందోళన

www.mannamweb.com


అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న ఓ చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

చిరుతను బందించాలని కోరుతూ హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉండితాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల కమల అనే బాలిక, ఖేమారామ్‌ మరియు ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ ఈ చిరుత దాడిలో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

ఉదయ్‌పూర్‌ జిల్లాలోని ఉండితాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల కమల అనే అమ్మాయి మేకలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు అంతా గాలించారు. ఆ మరుసటి రోజున చిధ్రమైన ఆమె మృతదేహం అడవిలో కనిపించింది. మరోవైపు భెడియా నుంచి గ్రామానికి తిరిగి వస్తున్న ఖేమారామ్‌, అతడి కొడుకుపై చిరుత దాడి చేసింది. బాలుడు పరుగెత్తి పారిపోగా ఆ చిరుత ఖేమారామ్‌ను చంపి తిన్నది. అటు, ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళను కూడా చిరుత పులి చంపింది. సెప్టెంబరు 8న ఝడోల్ సమీపంలో ఒక మహిళపై అది దాడి చేసింది.

చిరుత వరుస దాడుల నేపథ్యంలో ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం ఝడోల్, గోగుండ మధ్య రాష్ట్ర రహదారిని దిగ్భందించి నిరసన వ్యక్తం చేశారు.