చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లోని వుకి కౌంటీలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో స్థానిక బంగారు దుకాణం నుంచి దాదాపు 20 కిలోగ్రాముల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోవడంతో గందరగోళం చెలరేగింది.
జూలై 25 ఉదయం సంఘటన జరిగింది. వరద ప్రవాహంలో కొట్టుకుని పోయిన విలువైన నగల కోసం దుకాణ సిబ్బంది, నివాసితులు వెదకడం మొదలు పెట్టారు.
లావోఫెంగ్జియాంగ్ అనే నగల షాప్ సిబ్బందిజూలై 25 ఉదయం షాప్ తెరవడానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుకాణ యజమాని యే ఈ విషయంపై మాట్లాడుతూ.. రాత్రి సమయంలో షాప్ లో కాపలాగా ఉన్న సిబ్బంది ఆభరణాలను సేఫ్లలోకి తరలించలేదు. వరద గురించి హెచ్చరిక జారీ చేసే సమయంలో నగలు ప్రదర్శనకి వీలుగా ఉన్నాయి. నిమిషాల్లోనే షాప్ ముందు ద్వారం నుంచి షాప్ లోకి వరద నీరు ఉప్పొంగి ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంది. ఒక్కసారిగా శక్తివంతమైన నీటి ప్రవాహం దుకాణం నుంచి ప్రవహించడంతో ఆభరణాలతో నిండిన ప్రదర్శన క్యాబినెట్లు, ట్రేలు కొట్టుకుపోయాయి.
ఇలా నీటికి కొట్టుకుని పోయిన వస్తువులలో బంగారు హారాలు, గాజులు, ఉంగరాలు, చెవిపోగులు, పెండెంట్లు, వజ్రాల ఉంగరాలు, జాడే ముక్కలు, వెండి ఆభరణాలు ఉన్నాయని యే చెప్పారు. అంతేకాదు కొత్త ఇన్వెంటరీ, రీసైకిల్ చేసిన బంగారం, భారీగా నగదు ఉన్న దుకాణంలోని సేఫ్ కూడా కనిపించలేదని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా కొట్టుకుపోయిన వస్తువుల మొత్తం విలువ 10 మిలియన్ యువాన్లు (సుమారు రూ. 12 కోట్లు) మించి ఉంటుందని అంచనా.
నగలను తిరిగి వెదుకుతున్న సిబ్బంది
వరద తర్వాత కుటుంబ సభ్యులు, దుకాణ సిబ్బంది రెండు రోజులు ఆ ప్రాంతంలో నగల కోసం వెదకడం మొదలు పెట్టామని యే కుమారుడు జియావోయ్ చెప్పారు. ఇప్పటివరకు దాదాపు ఒక కిలోగ్రాము ఆభరణాలను తిరిగి పట్టుకున్నాని.. కొన్ని వస్తువులను నివాసితులు స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చారని చెప్పారు. వరదల సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో దుకాణంలోని సీసీ టీవీ సరిగ్గా పనిచేయకపోవడంతో సంఘటనను రికార్డ్ చేయడంలో విఫలమైంది. దీనివల్ల విలువైన వస్తువులు ఎలా కొట్టుకుపోయాయో లేదా వాటిని ఎవరైనా తీసుకెళ్లారో ట్రాక్ చేయడం కష్టంగా మారిందని చెప్పారు.
తప్పిపోయిన ఆభరణాల కోసం నివాసితులు
ఈ వార్త వ్యాపించగానే పోయిన ఆభరణాల కోసం ఆశతో నివాసితులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బురదలో నగల కోసం వెదుకుతున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది నగలను వెదికేందుకు మెటల్ డిటెక్టర్లను కూడా ఉపయోగించారని తెలుస్తోంది.
“కొంతమంది నివాసితులు నగలు తీసుకుంటున్నట్లు చూసిన వారు చెప్పారు. అయితే చాలా మంది తమకు దొరికిన వస్తువులని తిరిగి ఇవ్వడానికి ముందు రాలేదని జియావోయ్ అన్నారు. నగలు ఎవరికైనా దొరికితే వాటిని తమకు తిరిగి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరిగి ఇచ్చిన వస్తువుల విలువకు తగిన విధంగా బహుమతిని ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు తాము పోగొట్టుకున్న ఆభరణాలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నట్లు తెలిస్తే.. తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జియావోయ్ హెచ్చరించారు.

































