ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సింగరాయకొండ సమీపంలోని బిట్రగుంట గ్రామం వద్ద ఉన్న బీకేటీ (BKT) పొగాకు పరిశ్రమలో ఈరోజు ( అక్టోబర్ 10, 2025 )తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రమాదంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అనూహ్య ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఇంతటి స్థాయిలో భారీ నష్టం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్..
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. క్షణాల్లోనే మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. గోదాంలో నిల్వ ఉన్న పొగాకు బేళ్లు, ప్యాకేజింగ్ మెటీరియల్, యంత్రాలు, కెమికల్స్.. అగ్నికి ఆహుతయ్యాయి. బీకేటీ సంస్థ వద్ద జీపీఐ కంపెనీ అద్దెకు తీసుకుని ఈ పరిశ్రమను నడుపుతోంది. పొగాకు ప్రాసెసింగ్లో ఉపయోగించే రసాయనాల కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు. దట్టమైన పొగ మొత్తం ప్రాంతాన్ని కమ్మేసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కాగా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు, సింగరాయకొండ, టంగుటూరు, కందుకూరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు ఐదు గంటలపాటు సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల వేడి, పొగ కారణంగా రక్షణ చర్యలకు పెద్ద సవాలు ఎదురయ్యింది.
ఈ ప్రమాదంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తుండగా.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. పొగాకు బేళ్లు, యంత్రాలు, ప్రాసెసింగ్ సామగ్రి, ఎగుమతుల కోసం సిద్ధం చేసిన ఉత్పత్తులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలాన్ని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ సతీష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్లు పరిశీలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేక రసాయనాల రియాక్షన్ అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో పొగాకు పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది.































