Mega DSC Notification in Telangana: 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు ఇవిగో..

తెలంగాణలో కొత్తగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం (Mega DSC Notification in Telangana) విడుదల చేసింది. 11వేల 62 పోస్టులకు టీచర్‌ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (Mega DSC notification) విడుదల చేశారు. ఈ మేరకు 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.


ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. 11,062 పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి.
మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.

పోస్టుల వివరాలు..
స్కూల్‌ అసిస్టెంట్‌ 2629,
లాంగ్వేజ్‌ పండిట్‌ 727,
ఎస్జీటీ 6508,
పీఈటీ 182.