గతేడాదిలో రీఛార్జ్ ప్లాన్ ధరలను (Mobile Bills) భారీగా పెంచిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు మరోసారి పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరికి దేశీయ టెలికాం సంస్థలు మొబైల్ టారిఫ్లను 10-12 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్, మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయిలో యాక్టివ్ సబ్స్క్రైబర్లు పెరగడం, 5జీ సదుపాయాల నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని చెబుతున్నారు.
మే నెలలో దేశంలో మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఆ ఒక్క నెలలోనే 74 లక్షల మంది కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. 29 నెలల్లో ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. దీంతో మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 108 కోట్లకు చేరువైంది. ఆ నెలలో రిలయన్స్ జియో (Reliance Jio) లో కొత్తగా 55 లక్షల మంది చేరగా.. ఎయిర్టెల్ (Airtel)కు 13 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చారు.
- యూజర్ల సంఖ్య పెరగడంతో టారిఫ్ల (Mobile Tariffs) పెంపుపై టెలికాం సంస్థలు దృష్టిసారించినట్లు ఆర్థికసేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది. గతేడాది జులైలో బేస్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు సగటున 11-23శాతం పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికి మరో 10-12శాతం పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈసారి బేస్ ప్లాన్ల జోలికిపోకపోవచ్చని సమాచారం. మధ్య, ఉన్నతశ్రేణి ప్లాన్లలపై ఛార్జీలు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతేగాక, డేటా వినియోగం, డేటా వేగం, డేటాను వినియోగించే నిర్దిష్ట సమయాల ఆధారంగా ఈ పెంపు ఉండొచ్చని తెలుస్తోంది.
కొత్త రీఛార్జ్ ప్యాక్స్ డేటాలో భారీగా కోత పెట్టే అవకాశం కన్పిస్తోంది. డేటా ప్యాక్లను ప్రత్యేకంగా కొనుగోలు చేసేలా వీటిని రూపొందించనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ టారిఫ్లలో మార్పులు అవసరమని ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. ”ప్రస్తుత టారిఫ్లు యూజర్ అప్గ్రెడేషన్కు సరిపోవట్లేదు” అని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విట్టల్ ఇటీవల ఓ సమావేశంలో పేర్కొన్నారు.
































