దేశంలో మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి.
ఈ వందే భారత్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందించనున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడనున్నాయి.
వారణాసి-ఖజురహో ఎక్స్ప్రెస్..
వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి మతపరమైన, సాంస్కృతిక నగరాలను కలుపుకుని వెళ్లుంది. ఇది ప్రస్తుత రైళ్లతో పోలిస్తే సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా చేస్తుంది. ఈ రైళ్లు యాత్రికులు, పర్యాటకులకు ఖజురహో వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.
లక్నో-సహరాన్పూర్ ఎక్స్ప్రెస్
ఈ ప్రయాణాన్ని దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేయడానికి సహాయపడుతుంది. దాదాపు 1 గంట సమయం ఆదా అవుతుంది. ఈ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారాన్పూర్లను కలుపుతుంది. రూర్కీ ద్వారా హరిద్వార్కు కూడా సులభంగా చేరుకోవచ్చు.
ఫిరోజ్పూర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్
ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు. ఇది కేవలం 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు పంజాబ్లోని ఫిరోజ్పూర్, బటిండా, పాటియాలా వంటి కీలకమైన నగరాలను ఢిల్లీతో కలుపుతుంది. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఎర్నాకులం – బెంగళూరు ఎక్స్ప్రెస్
దక్షిణ భారతదేశంలో ప్రయాణ సమయాన్ని 2 గంటలకు పైగా తగ్గించి కేవలం 8 గంటల 40 నిమిషాలకు తగ్గిస్తుంది. ఎర్నాకులం – బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను అనుసంధానించడంలో కూడా సహాయపడుతుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.



































