ఏపీలో వారందరికి శుభవార్త.. బ్యాంక్ అకౌంట్‌లలోకి డబ్బులు, మార్గదర్శకాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వం ఆపివేసిన ప్రోత్సాహకాలను ఇప్పుడు విడుదల చేస్తోంది. రూ.1,030.95 కోట్లు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు.


ఇది దీపావళి కానుకగా ఎంఎస్‌ఎంఈలు, భారీ, మెగా యూనిట్లకు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా 2,536 ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ.275.47 కోట్లు విడుదలకు అనుమతించారు. గత ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో చాలామంది పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పెండింగ్‌ మొత్తాలను విడుదల చేస్తూ, పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు సిద్ధమైంది. ఈ ప్రోత్సాహకాలు ఎంఎస్‌ఎంఈలు (చిన్న, మధ్య తరహా పరిశ్రమలు), భారీ పరిశ్రమలు, మెగా ప్రాజెక్టులకు అందనున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నిర్ణయం పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు బస్సులు ఇచ్చారు. వాటిని ఆర్టీసీలో నడిపేందుకు అనుమతి కూడా ఇచ్చారు. అయితే, ఈ బస్సులు కొనుగోలులో నకిలీ ఇన్వాయిస్‌లు ఉపయోగించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని దళిత్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పథకం కింద మంజూరు చేసిన 426 బస్సులకు ఇచ్చిన రిబేట్‌/డిస్కౌంట్‌కు సంబంధించిన సమాచారాన్ని డీలర్ల నుంచి పరిశ్రమల శాఖ కోరింది. ఇప్పటివరకు 310 బస్సులకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు పంపారు. ఈ బస్సులకు ప్రోత్సాహకాలు చెల్లించనున్నారు. మిగిలిన 116 బస్సులకు సంబంధించిన సమాచారం డీలర్ల నుంచి అందిన తర్వాతే, వాటికి ప్రోత్సాహకాల కింద రూ.14 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

టెక్స్‌టైల్ పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి.. వారికి ప్రోత్సాహకాలు విడుదల చేస్తే ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుందని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఈ ప్రోత్సాహకాల చెల్లింపునకు కొన్ని నిబంధనలు సడలించారు. ఆరేళ్లు పూర్తయిన ఎంఎస్‌ఎంఈలు, ఎనిమిదేళ్లుగా ఉత్పత్తిలో ఉన్న లార్జ్, మెగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. అవి ప్రస్తుతం మూతపడినా, యాజమాన్యం మారినా ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి.

గత ప్రభుత్వ హయాంలో ‘బడుగు వికాసం’ కింద ఇచ్చిన బస్సులకు కూడా ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి లభించింది. డీలర్ల నుంచి పొందిన డిస్కౌంట్‌ మొత్తంపై ప్రోత్సాహకాన్ని లెక్కించి, భవిష్యత్తులో విడుదల చేసే మొత్తంలో సర్దుబాటు చేస్తారు. ఇప్పటికే డీలర్ల నుంచి డిస్కౌంట్‌ పొందిన కేసులను స్టేట్‌ లెవెల్‌ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమైన యూనిట్లకు సంబంధించిన కేసుల్లో, ఆడిట్‌ శాఖ నుంచి సమాధానం వచ్చిన యూనిట్లకు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఎన్వోసీ (No Objection Certificate) లేకుండా బ్యాంకు ఖాతాలు మార్చిన యూనిట్లకు కూడా ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సడలింపులతో టెక్స్‌టైల్ యూనిట్లు కొంత ఊరట పొందుతాయని ఆశిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.