పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేశ్ రాథోడ్ (Raksh Rathore) అరెస్టయ్యారు.
పెళ్లి చేసుకుంటానని, రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయ మాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. ఎంపీ రాకేశ్ రాథోడ్కు, తనకు మధ్య ఫోన్ కాల్ వివరాలను, కాల్ రికార్డింగులను కూడా ఆమె పోలీసులకు అందజేశారు.
వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు
దీంతో పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు. అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం ఈ నెల 23న బుధవారం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అంతకుముందు సీతాపూర్ (Sitapur) లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా రాకేశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు రాకేశ్ రాథోడ్ గురువారం ఉదయం పోలీసుల ముందు లొంగిపోయారు.
రాకేశ్ రాథోడ్ గత లోక్సభ ఎన్నికల్లో సీతాపూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇక బాధితురాలి భర్త కూడా పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. కేసును వాపస్ తీసుకోవాలని ఎంపీ, ఆయన కుమారుడు ఒత్తిడి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.