హోం మంత్రి అనితను కలిసిన ముంబై నటి జత్వానీ

www.mannamweb.com


ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెక్రటేరియట్‌లో ఏపీ హోమంత్రి అనితను కలిశారు జత్వాని. తనకు జరిగిన అన్యాయంపై అరగంట పాటు గోడు వెళ్లబోసుకున్నారు.

సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లి, తండ్రి పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును అనితకు వివరించారు. తన ఫోన్‌ను ఓపెన్ చేసేందుకు యత్నించారన్నారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని. తనపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిందన్నారు జత్వాని. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని హోమంత్రిని కోరామన్నారు. తనకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.

జత్వానీ వ్యవహారం వెనుక ఉన్న పెద్దలెవరో బయటకు వచ్చిందన్నారు ఆమె లాయర్ నర్రా శ్రీనివాసరావు. ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వానీపై ఏపీలో కేసు పెట్టారన్నారు. ఇక్కడ జత్వానీపై ఉన్న కేసు క్లోజ్ అయితే.. ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతామన్నారు. జత్వానీ మీద కేసును విత్ డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుందన్నారు.

జత్వాని కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ , కేసు వివరాలుపై విజయవాడ సీపీని అడిగి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత. జత్వాని కేసులో ఇన్వాల్వ్‌ అయిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.