NEET-UG Exam: ‘పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుంది’.. నీట్‌ 2024 రద్దు పిటిషన్లపై సుప్రీం

దిల్లీ: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ – 2024 పరీక్షలో (NEET-UG 2024 Exam) అవతవకలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. పరీక్షను క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.


‘‘ఇది మీరు అనుకున్నంత సులభం కాదు. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవితత్ర దెబ్బతింటాయి. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ యూజీ -2024 ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. జూన్‌ 4న ఫలితాలను ప్రకటించారు. అయితే తొలుత జూన్‌ 14న ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి.. అంతకంటే ముందే ఓట్ల లెక్కింపు జరుగుతుండగా విడుదల చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఫలితాల్లో (NEET Result) 67 మంది విద్యార్థులకు ఆలిండియా మొదటి ర్యాంక్‌ రాగా, వారిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది.

ఈ పరీక్షలో పేపర్‌ లీకేజీ (Paper Leak) జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు (Malpractice) చోటుచేసుకున్నాయని కాంగ్రెస్‌ సహా పలు విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.