ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190 కొత్త 108 (అత్యవసర) అంబులెన్సులను రోడ్లపై తీసుకురాబోతుంది. దీనివల్ల రోడ్డు, ఇతర ప్రమాద క్షతగాత్రులను ఇప్పటికంటే మరింత వేగంగా ఆసుపత్రులకు తరలించేందుకు వీలు కలుగుతుంది.
కూటమి ప్రభుత్వం టెండరు నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం సిద్ధమైన ఈ కొత్త అంబులెన్సులను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిచంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో డొక్కు, తుక్కుగా తయారై.. తరచూ మరమ్మతులకు గురవుతున్న అంబులెన్సులను తొలగించి, వాటి స్థానంలో ఈ కొత్త అంబులెన్సులను నడుపనున్నారు. దీనివల్ల ‘గోల్డెన్ అవర్’లోనే రోడ్డు, ఇతర ప్రమాద క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో వైద్యం అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ‘నేషనల్ అంబులెన్సు కోడ్’ ప్రకారం అంబులెన్సులపై రంగులు వేసినట్లు పేర్కొన్నారు.
కాలంచెల్లిన వాహనాలకు ఇక సెలవు
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక టెండరు ద్వారా ఎంపిక చేసిన ‘భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్లో 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించింది. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనల్లో భాగంగా సదరు సంస్థ ఒక్కొక్క అంబులెన్సుకు సుమారు రూ.27 లక్షల వరకు ఖర్చుపెట్టింది. ఇందులో 56 అడ్వాన్సు సపోర్టు, 134 బేసిక్ అడ్వాన్సు సపోర్టు అంబులెన్సులు ఉన్నాయి. అడ్వాన్సు సపోర్టు అంబులెన్సులో ప్రధానంగా రెండు వెంటిలేటర్లు, ఇతర పరికరాలు అందుబాబులో ఉంటాయి. దీనివల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు వీలవుతుంది. కాల్ సెంటరుకు ఫోన్ వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రులకు గంటలోపు తరలించడాన్ని ‘గోల్డెన్ అవర్’ గా పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 650 అంబులెన్సులు నడుస్తున్నాయి. వీటిలో పాతవాటిని తొలగించగా కొత్తవాటితో కలిపి మొత్తం నడిచే వాహనాల సంఖ్య 731కు చేరుకుంది.
జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రంగులు మార్పు
గత ప్రభుత్వ పాలనలో నీలం రంగు, ఆకువచ్చ రంగుతో అంబులెన్సులు ఉండేవి. కేంద్ర ప్రభుత్వ నేషనల్ అంబులెన్స్ కోడ్ ప్రమాణాలనుసరించి ఈ కొత్త 190 అంబులెన్సులపై తెలుపు, ఎరుపు రంగులు ప్రధానంగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోని 108 అంబులెన్సులపై ఇవే రంగులుండాలని కేంద్ర ప్రభుత్వ నేషనల్ అంబులెన్స్ కోడ్ స్పష్టం చేసింది.
































