తెలంగాణలోని పేద, మధ్యతరగతి చిన్నారులకు నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
రాబోయే విద్యా సంవత్సరం 2026-27 నాటికి ప్రీ-ప్రైమరీ విద్యను రాష్ట్రవ్యాప్తంగా మరింత విస్తరించాలని విద్యాశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించి ప్రభుత్వం మంచి స్పందనను పొందింది. ఈ విజయం స్ఫూర్తితో.. వచ్చే ఏడాది మరింత దూకుడుగా వ్యవహరించి అదనంగా 4,900 పాఠశాలల్లో ఈ తరగతులను ప్రారంభించేందుకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ విస్తరణతో రాష్ట్రంలోని మొత్తం 5,900 ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రాథమిక విద్య అందనుంది.
ఈ బృహత్తర కార్యక్రమం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోంది. ఒక్కో పాఠశాలలో యూకేజీ తరగతి కోసం ఒక అనుభవజ్ఞుడైన టీచర్ (ఇన్స్ట్రక్టర్)తో పాటు ఒక ఆయాను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, రాబోయే విద్యా సంవత్సరంలో ఈ 4,900 పాఠశాలల్లో దాదాపు 9,800 మందికి చిన్న స్థాయి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ నియామకాలు ప్రధానంగా స్థానిక మహిళలకు ఉపాధిని కల్పించనున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం యూకేజీ (నాలుగేళ్లు నిండిన పిల్లలు) నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యతను పెంచాలంటే నర్సరీతోపాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకురావాలని కొందరు ప్రముఖ విద్యావేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, భవిష్యత్తులో ఈ తరగతులను కూడా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు సూచనప్రాయంగా తెలిపారు.
తెలంగాణలో మొత్తం 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలన్నింటినీ కవర్ చేసే విధంగా దశల వారీగా ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షా నిధులు, పీఎం శ్రీ పథకం, ప్రభుత్వ పాఠశాలల కింద మొత్తం 1,362 బడుల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఇప్పటికే సుమారు 8,976 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. దీనికోసం ప్రస్తుత విద్యా సంవత్సరానికి రూ.35.77 కోట్లు నిధులు విడుదలయ్యాయి.
రాబోయే విస్తరణ కార్యక్రమం ద్వారా తెలంగాణలో ప్రభుత్వ విద్య పునాది పటిష్టమై, మారుమూల ప్రాంతాల్లోని చిన్నారులు సైతం మెరుగైన విద్యను పొందే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.



































