RBI: గవర్నర్ సంతకంతో రూ. 100, రూ 200 కొత్త నోట్లు.

ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ. 100, రూ. 200 డీనామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నోట్లు వస్తాయని ఈ మేరకు ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దీనినే ట్విట్టర్‌లో (X) కూడా పోస్ట్ చేసింది. ఇవి కూడా మహాత్మా గాంధీ (New) సిరీస్‌లో భాగంగానే ఉంటాయని తెలిపింది. అంటే ఇప్పుడు విడుదల చేయబోయే కొత్త నోట్లు కూడా పాత వాటినే పోలి ఉంటాయని వెల్లడించింది. అంటే గవర్నర్ సంతకం దగ్గర మాత్రమే.. ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఉంటుందని తెలిపింది.


”ఇప్పుడు విడుదల చేయబోయే రూ. 100, రూ. 200 నోట్లు.. మహాత్మా గాంధీ (New) సిరీస్‌లోని బ్యాంక్ నోట్లనే పోలి ఉంటాయి.” అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో పాత నోట్లపైనా క్లారిటీ ఇచ్చింది. అంటే గతంలో జారీ చేసిన రూ. 100, రూ. 200 నోట్లు కూడా చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతాయని, సర్క్యులేషన్లోనే ఉంటాయని క్లారిటీ ఇచ్చింది.

ఇక ఆర్బీఐ 26వ గవర్నర్‌గా అప్పటివరకు రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రాను (56) కేంద్ర ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 11 నుంచే ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. అప్పటినుంచి మూడేళ్ల పాటు ఆయన గవర్నర్ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అంతకుముందు శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్‌గా 2018లో మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. 2021లో ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ మరో మూడేళ్లు పదవీకాలం పొడిగించింది. ఇక రెండో విడత పదవీ కాలం ముగియగా.. సంజయ్ మల్హోత్రా బాధ్యతల్లోకి ఎక్కారు.

దీనికి ముందు కొత్త గవర్నర్ సంతకంతో రూ. 50 నోట్లు కూడా జారీ చేయనున్నట్లు ఆర్బీఐ ఫిబ్రవరి నెలలోనే ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చాలా వరకు చలామణీలో ఉన్న నోట్లలో.. మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో ప్రింట్ అయినవే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌‌లో మల్హోత్రా సంతకంతో.. ఇటీవల కొత్త రూ. 50 నోట్లు; అలాగే ఇప్పుడు కొత్త రూ. 100, రూ. 200 నోట్లు జారీ చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. మరి త్వరలోనే రూ. 500 నోట్లపైనా కొత్త గవర్నర్ సంతకంతో కొత్త ప్రింట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.