ఏపీలో ఎన్నికల విచిత్రం.. అక్కడ నో వైసీపీ.. టీడీపీ వర్సెస్ జనసేన పోటీ

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడో సంఘటన ఆసక్తికరంగా మారింది. కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న పార్టీలే ప్రత్యర్థులుగా తలపడుతున్న వైనం.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇదెక్కడో జరిగితే అంత ఇంట్రస్టింగ్‌గా ఉండేది కాదేమో.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో ఈ పోటీ జరుగుతూ ఉండటమే ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తిని రేపుతోంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గం గురించే ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడమే అందుకు ప్రధాన కారణం. ఇక అంచనాలకు తగినట్లుగానే పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై రికార్డు విక్టరీ సాధించిన పవన్ కళ్యాణ్.. తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టారు.

అయితే ఇప్పుడు అదే పిఠాపురం నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోటీ జరుగుతోంది. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీలోని ఐదు డైరెక్టర్ పదవులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటోంది. ఐదు డైరెక్టర్ పదవులకు 18 మంది నామినేషన్లు వేశారు. ఆ తర్వాత ఆరుగురు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఐదు పదవులకు 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తరుఫున కొంతమంది అభ్యర్థులు, జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తరుఫున మరికొంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే గుర్తుల కేటాయింపు కూడా పూర్తైంది. అక్టోబర్ 6వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో పోటీ టీడీపీ, జనసేన మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆలోపు రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సయోధ్య కుదరకపోతే.. పోటీ టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య ఉండే అవకాశం ఉంది. ఏం జరుగుతుందనేదీ చూడాలి మరి.