ఫోన్‌లో డాక్టర్.. గర్భిణీకి నర్సులు ట్రీట్మెంట్! ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంతో

www.mannamweb.com


ఆమె బిడ్డ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. గర్భవతి అని తెలిసిన దగ్గర నుంచి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంది. తన కడుపున ఊపిరి పోసుకున్న బిడ్డ నోటి నుంచి అమ్మ అనే పిలుపు వినాలని ఆత్రుతగా ఎదురు చూడసాగింది. ఎప్పుడెప్పుడు బిడ్డకు జన్మనిస్తానా.. తనలో ప్రాణం పోసుకున్న బిడ్డను ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా.. అని ఎదురు చూడసాగింది. మరి కొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేది. ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమ్మా అన్న పిలుపు కోసం ఆరాటపడిన ఆ మహిళ.. కనీసం బిడ్డను చేతుల్లోకి తీసుకోకుండానే కన్ను మూసింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన వనపర్తిలో చోటు చేసుకుంది. శ్రీరంగపూర్‌ మండలం, నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత.. 4 నెలల గర్భిణి. పుట్టబోయే బిడ్డ కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగింది. ఇలా ఉండగా ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. దాంతో.. పెబ్బేరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేరు. అయినా సరే పుష్పలతను ఆస్పత్రిలో చేర్చుకున్నారు ఆస్పత్రి సిబ్బంది. ఆ తర్వాత డాక్టర్‌కు కాల్‌ చేసి విషయం చెప్పారు. ఇక ఆ వైద్యురాలు ఆస్పత్రికి రాకుండా.. ఫోన్‌లోనే ట్రీట్‌మెంట్‌ గురించి నర్సులకు సూచనలు, సలహాలు ఇవ్వసాగింది.

నర్సులు కూడా ఫోన్‌లో మాట్లాడుతూ, మెసేజ్‌ల ద్వారా ట్రీట్‌మెంట్‌ గురించి ఇచ్చిన సూచనలను పాటిస్తూ…. పుష్పలతకు చికిత్స అందించారు. అయితే వారి వైద్యం వికటించి పుష్పలత గర్భసంచి బ్లాస్ట్‌ అయ్యింది. దాంతో ఆమె మృతి చెందింది. డాక్టర్‌ కక్కుర్తి వల్ల మరో ఐదు నెలల్లో బిడ్డకు జన్మనివ్వాల్సిన మహిళ ఇలా.. మృత్యువాతపడటం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే పుష్పలత్ మృతి చెందిందని.. ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌, నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆస్పత్రిని మూసేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.