ఒకప్పుడు ఉదయం టీచర్.. సాయంత్రి కుట్టుమిషన్.. ఇప్పుడు సాప్ట్ వేర్ కంపెనీ..

జీవితమంటే పూల పాన్పు కాదు.. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కోవాలి. కష్టాలను ఈదాలి.. బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టేవారు కొందరు ఉండొచ్చు.. అయితే పుట్టగానే కష్టాల మూటను మోసే వారు మరికొందరు ఉంటారు. నేటి కాలంలోచిన్న కష్టానికే తమ జీవితం కోల్పోయామన్న బాధతో కుంగిపోతుంటారు. కానీ కష్టాలెన్ని ఎదురైనా ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకునేవారు లేకపోలేదు. అలాంటి వాళ్లలో మహిళలు ఉంటున్నారు. రోజుకు రూ.5 కూలీ పనిచేసే ఓ మహిళ ఆటుపోట్లను అధిగమించి నేడు సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టేస్థాయికి చేరుకున్నారు. ఇప్పుుడు ఆమె సంపాదన ఎంతో తెలుసా?


తెలంగాణకు చెందిన జ్యోతిరెడ్డి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె పుట్టగానే కష్టాల కడలిలో చిక్కుకున్నారు. ఐదుగురు సంతానంలో ఆమె ఒకరు. ఆమె తండ్రి దినసరి కూలి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే తల్లిదండ్రులకు భారం ఎందుకని ఆశ్రమ పాఠశాలలో ఉంటూ చదివారు. అయినా ఆర్థిక భారం తట్టుకోలేక ఆమెకు 16 ఏళ్ల సమయంలోనే పెళ్లి చేశారు. 18 ఏళ్లకే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు.

ఈ క్రమంలో కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ టీచర్ గా మారారు. అయితే ఆదాయం సరిపోకపోవడంతో రాత్రి మెషిన్ కుట్టేవారు. కానీ ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కోరిక ఉండేది. దీంతో ఉన్నత చదువులు చదవడం ప్రారంభించారు. 1994లో బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా బీఏ చదివారు. ఆ తరువాత పీజీ పూర్తి చేశారు. కానీ వివిధ పనులు చేసినా నెలకు రూ.300 కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఇవి కుటుంబ అవసరాలకు సరిపోయేవి కావు.

దీంతో కొందరు బంధువులు అమెరికాలో ఉన్న అవకాశాల గురించి చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు ఆమె కంప్యూటర్ కోర్సు కూడా నేర్చుకున్నారు. కానీ ఫలితం ఇవ్వలేదు. అక్కడికి వెళ్లిన తరువాత సరైన అవకాశాలు రాకపోవడంతో మొదట పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. కానీ ఎక్కడా కుంగిపోకుండా లక్ష్యం కోసం శ్రమించేవారు. చివరకు ఆమెకు రిక్రూట్ మెంట్ ప్రెఫెషనల్ ఉద్యోగం లభించింది. ఇక్కడ ఆమె కెరీర్ మలుపు తిరిగింది. అ ఆ తరువాత డబ్బు బాగా సంపాదించిన తరువాత కీ సాప్ట్ వేర్ సొల్యూషన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.125 కోట్లు..