జనసేన నేత కిరణ్ రాయల్‌పై సంచలన ఆరోపణలు..

తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌పై వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది.


కిరణ్‌ రాయల్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలని జనసేన పార్టీ ఆదేశించింది. కిరణ్ రాయల్‌పై గత కొద్ది రోజులు సోషల్ మీడియాలో చోటుచేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన జరపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీని ఆదేశించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్‌ రాయల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టుగా తెలిపారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హరి ప్రాద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించినట్లు ఆయన తెలిపారు.

ఇక, కిరణ్ రాయల్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. కిరణ్‌ రాయల్‌ తనను బెదిరించాడని, రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని ఆ మహిళ ఆరోపించారు. కిరణ్ రాయల్ వల్లే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని.. తాను చనిపోయిన తరువాత అయినా ఆ డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరారు. ఈ మేరకు మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది. దీంతో కిరణ్ రాయల్ వ్యవహారం సంచనలంగా మారింది. మరోవైపు కిరణ్ రాయల్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు. ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీలను రాజకీయం చేయడం సరికాదని అన్నారు. ఆడవాళ్లను ముందుపెట్టి రాజకీయం చేయడం మంచి పద్దతి కాదని చెప్పారు. గతంలో తన ఫోన్లు స్వాధీనం చేసుకుని.. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని చోరీ చేశారని ఆరోపించారు. ఆ డేటాతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. మహిళను అడ్డం పెట్టుకుని చేస్తున్న రాజకీయానికి భయపడేది లేదని చెప్పారు. వైసీపీ నేతలు బెదిరింపులతో తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను విమర్శించడంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.