పుష్కరాలకు ముందే ‘పోలవరం’

‘గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తాం. 2027 ఆగస్టులో గోదావరికి పుష్కరాలు. ఏ సాంకేతిక సమస్యలు లేకుంటే 2027 ఏప్రిల్‌ నాటికే పోలవరం పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇబ్బందులు ఎదురైనా 2027 డిసెంబరుకు పోలవరం పూర్తి చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును గురువారం ఆయన సందర్శించి, పనులను పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడారు. పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యాం పూర్తయింది. 2026 జులై నాటికి ఎడమ, కుడి కాలువల అనుసంధాన పనులు పూర్తి చేసి రెండు కాలువలకు గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాలనే ఆలోచన ఉంది. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేలా విభజన చట్టంలో పేర్కొని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రం 2014లో సహకరించింది. ఇప్పుడూ సహకరిస్తోంది. 45.72 మీటర్ల ఎత్తుకు పోలవరం నీళ్లు నిలబెడతాం. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం.


పునరావాస కాలనీలకు టెండర్లు
పునరావాస కాలనీల నిర్మాణానికి తాజా ధరలతో మళ్లీ టెండర్లు పిలుస్తున్నాం. మొత్తం రూ.972 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. తొలి దశ 1ఏలో ఇప్పటికే 14,309 కుటుంబాలను తరలించాం. మరో 6,700 కుటుంబాలను తరలించాలి. 49 కాలనీలు పూర్తి చేయాలి. పునరావాసం తొలిదశ 1బీలో భాగంగా 49 ఆవాసాల వారిని తరలించాలి. తొలిదశలోనే ఇంకా రూ.6,270 కోట్లు ఖర్చవుతుంది.

జగన్‌ రాజకీయ కక్షతోనే ప్రాజెక్టు విధ్వంసం
జగన్‌ రాజకీయ కక్షతోనే ప్రాజెక్టులో ఇంత విధ్వంసం జరిగింది. ప్రజలు ఓటేసి, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల పోలవరం జీవనాడి విధ్వంసమైంది. పోలవరంలో రివర్స్‌ టెండర్ల వల్ల రూ.5,282 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టులో అదనంగా రూ.2,782 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. పోలవరం విద్యుత్తు కేంద్రంలో రూ.2,500 కోట్లు నష్టపోయాం. ఒక తప్పు వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. అప్పట్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న విషయమూ ఎవరికీ తెలియదు. వాళ్లు గుర్తించలేదు. మన ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే 2020 జూన్‌కే ఈ ప్రాజెక్టు సులభంగా పూర్తయిపోయేది.

అప్పుడూ ఇప్పుడూ కేంద్ర సాయంతో గాడిలో పెట్టాం
రాష్ట్ర విభజన తర్వాత అడుగడుగునా అవకాశాలు ఉపయోగించుకుని రాష్ట్రాన్ని బాగు చేసేందుకు ప్రయత్నించా. రాష్ట్రం రూపురేఖలు మార్చాలనుకున్నా. పోలవరం ప్రాజెక్టు 7 ముంపు మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని నాడు కేంద్రాన్ని ఒప్పించి ముందే ఆర్డినెన్సు తెప్పించా. జూన్‌ 2న రాష్ట్ర విభజన నోటిఫికేషన్‌ రాక ముందే ఆర్డినెన్సు తీసుకురావడం ఓ రికార్డు. 2019లో ప్రభుత్వం మారడంతోనే పరిస్థితులు మారిపోయాయి. రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టుపై కక్షగట్టి, విధ్వంసం చేశారు. తెదేపా, జనసేన, భాజపా కలిసి అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలో మళ్లీ మన ప్రభుత్వమే వచ్చింది. అప్పటికి ఉన్న సాంకేతిక సమస్యలు చూసి భయం వేసింది. ఇది చేయగలమా అనిపించింది. కేంద్ర సాయంతో సాంకేతిక సమస్యలన్నీ పరిష్కరించి, ఒక కొలిక్కి తీసుకువచ్చాం. మళ్లీ గాడిలో పెట్టాం. బాధ, ఆవేదన, నిరాశ నుంచి మళ్లీ పోలవరం పూర్తి చేయగలమన్న ఆశ, నమ్మకం కలిగాయి.

పర్యాటక కేంద్రంగా పోలవరం
పోలవరం ప్రాజెక్టు వద్ద నాలుగు ఐల్యాండ్‌లు ఉన్నాయి. ఆ కొండలపై హోటళ్లు నిర్మిస్తాం. పాపికొండల నుంచి ధవళేశ్వరం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాం. పోలవరం వద్ద ఐకానిక్‌ వంతెన నిర్మిస్తాం. పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటాం. పుష్కరాల నాటికే వీటిని అభివృద్ధి చేసేలా ప్రయత్నిస్తాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

పునరావాస కాలనీల్లో పరిశ్రమల ఏర్పాటు!

పోలవరం ప్రాజెక్టు నీళ్లతో రైతులకు మేలు జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్టు కోసం ఊళ్లు, భూములు వదులుకున్న నిర్వాసితులకు న్యాయం చేయాలి. వారికి పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్‌ కూడా తీసుకువచ్చి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. పునరావాస కాలనీల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. నిర్వాసితులకు మెరుగైన జీవనోపాధి కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఏదైనా ఎన్జీవో ఉంటే సంప్రదించి వారి సూచనల ప్రకారం మెరుగైన జీవనం అందిస్తాం. ఎలాంటి అవకతకవలు జరగకుండా నిర్వాసితులకు సాయం చేస్తాం.