ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం.. పాలనలో వైఫల్యం చెందడం.. ఇచ్చిన గ్యారంటీల హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో వారికి ఉపశమనం.. లబ్ధి చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
తెలంగాణ రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం నెలకొల్పేలా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కల్పిస్తూ తెలంగాణ మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
‘తెలంగాణ రెవెన్యూ శాఖలో నూతన అధ్యాయం మొదలైంది’ అని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షణీయమని తెలిపారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యోగ వర్గాలు హర్షం
రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు మాత్రమే పోస్టులు ఉండేవని డిప్యూటీ కలెక్టర్ల సంఘం గుర్తుచేసింది. గతంలో ఉన్న విధానంతో ఆ పై కేడర్లో పని చేసే అవకాశం లేకుండా ఉండేదని పేర్కొంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి డిప్యూటీ కలెక్టర్ సంఘం తరపున తీసుకెళ్లి సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల ప్రాధాన్యం వివరించినట్టు లచ్చిరెడ్డి, రామకృష్ణ వెల్లడించారు. తాజాగా వీటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు రాష్ట్రంలో 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వివరించారు. మంత్రిమండలి ఆమోదంతో ఈ ప్రక్రియ పరిపూర్తి అయిందని.. ఇది రెవెన్యూ చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రకటించింది.































