అరిష్టం.. కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు

బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ ఏపీ తీరాన్ని దాటింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. తీరం దాటిన అనంతరం తీవ్ర తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది.


రాబోయే ఆరు గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నంకు సుమారు 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణించి, ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే క్రమంలో మరింత బలహీనపడనుంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి.తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 22 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

నివాస గృహం కూలిపోవడం అరిష్టం

కడపలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి కోసం పోటీ పడుతున్న వారసులు సైతం నివాస గృహాన్ని కాపాడుకునే ప్రయత్నం చెయ్యలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన ప్రతీ భక్తులు స్వామివారి నివాస గృహాన్ని సందర్శిచే వారని చెబుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మఠం అభివృద్ధి చేస్తున్నామని అధికారులు గొప్పలు చెప్పారని, అధికారుల అలసత్వం కారణంగా నివాస గృహం కూలిందని భక్తుల ఫైర్ అవుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం అరిష్టమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.