చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?

www.mannamweb.com


చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఈ కేసులో 37వ నిందితుడైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులైన భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ముందస్తు ప్రణాళికతో సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్‌రెడ్డి, గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత కేసుకు సంబంధించిన 34 మందిని జైలుకు పంపారు.

ఈ కేసులో కుట్రదారులు ఎవరనే విషయం పోలీసు శాఖకు అప్పట్లో తెలిసినా కేసు నమోదుకు వెనుకంజ వేశారు. బాధితులు వీడియో సాక్ష్యాలు అందజేసినా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పులివర్తి నాని న్యాయ పోరాటం సైతం చేశారు. సార్వత్రిక ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారు కావడంతో పోలీసులు కుట్రదారులపై దృష్టి పెట్టారు. ఇటీవల 37వ నిందితుడిగా చంద్రగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. ఈ కేసులో అరెస్టు తప్పదని భావించిన మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ పిటిషన్‌ స్వీకరించి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో మోహిత్‌రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చని భావించిన ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రత్యర్థి పులివర్తి నానిపై వ్యక్తిగత ఆరోపణలు సంధిస్తూ.. కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఈ  నేపథ్యంలో కేసు నమోదు చేశాక అరెస్టు తప్పదనేలా పోలీసులు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.