ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉండగా.. ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పీఎం మోదీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, భ్రమరాంబ దేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ప్రధాని మోదీ ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న ఐదవ ప్రధానిగా నిలిచారు.
ప్రధాని మోదీ ఆలయం మొత్తం కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలను సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. ఈ ముగ్గురు నేతల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆలయంలో పూజల అనంతరం ప్రధాని మోదీ శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677లో శ్రీశైలాన్ని సందర్శించిన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ స్మారక సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడ ఉన్న శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించారు.
ఈ ధ్యాన మందిరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ధ్యానముద్రలో ఉన్న విగ్రహంతో పాటు నాలుగు దిక్కులలో ప్రతాప్గఢ్, రాజ్గఢ్, రాయ్గఢ్, శివనేరి వంటి ముఖ్యమైన కోటల నమూనాలు ఉన్నాయి. ప్రధాని మోదీ అక్కడ ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించి, దర్బార్ గోడలపై ఉన్న ఆయన జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా వీక్షించారు.
శ్రీశైలం పర్యటన తర్వాత ప్రధాని మోదీ ర్నూలుకు వెళ్లారు. అక్కడ రాష్ట్రంలోని వివిధ రంగాలలో సుమారు రూ.13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో పరిశ్రమలు, విద్యుత్ సరఫరా, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలు ఉన్నాయి.
































