హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు, ఎయిర్పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి కోసం గ్రేటర్ ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే.
పుష్పక్ బస్సులలో చార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఇటీవల పుష్పక్ ఛార్జీలను పెంచినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్పక్ ఏసీ బస్సు ఛార్జీలను రూ. 50 నుంచి రూ. 100 వరకు తగ్గిస్తున్నట్టుగా ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఎయిర్పోర్టు నుంచి వివిధ ప్రాంతాల మధ్య పుష్పక్ ఏసీ బస్సుల్లో పాత, కొత్త ఛార్జీల మధ్య తేడా ఈ విధంగా ఉంది.
ఎయిర్పోర్టు – శంషాబాద్… పాత ఛార్జీ రూ. 200, కొత్త ఛార్జీ రూ. 100
ఎయిర్పోర్టు – ఆరాంఘర్… పాత ఛార్జీ రూ. 250, కొత్త ఛార్జీ రూ. 200
ఎయిర్పోర్టు – మోహదీపట్నం… పాత ఛార్జీ రూ. 350, కొత్త ఛార్జీ రూ. 300
ఎయిర్పోర్టు – పహాడీషరీఫ్… పాత ఛార్జీ రూ. 200, కొత్త ఛార్జీ రూ. 100
ఎయిర్పోర్టు – బాలాపూర్… పాత ఛార్జీ రూ. 250, కొత్త ఛార్జీ రూ. 200
ఎయిర్పోర్టు – ఎల్బీ నగర్… పాత ఛార్జీ రూ. 350, కొత్త ఛార్జీ రూ. 300
అలాగే రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 06.00 గంటల వరకు ఇప్పుడున్న ఛార్జీలను సైతం 50 రూపాయలు తగ్గించారు. దీంతో ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీబస్స్టేషన్, జేఎన్టీయూ, మియాపూర్, లింగంపల్లికి వెళ్లే పుష్పక్ బస్సుల్లో ఛార్జీల తగ్గనున్నాయి. ఈ రూట్లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రూ.450 చార్జీలు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ.400గా నిర్ణయించారు. దీంతో ప్రయాణికులకు ఊరట లభించనుంది.
































