Ragi Java : రోజూ రాగి జావలో ఇది కలిపి తీసుకోండి.. ఎముకలు దృఢంగా మారుతాయి..

Ragi Java : రాగులు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో ఇవి ఒకటి. చిరు ధాన్యాలలోకెల్లా రాగులు అతి శక్తివంతమైనవి. రాగులు చాలా బలవర్దకమైన ఆహారం.
వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రాగులు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. వీటిలో ఉండే అమైనో యాసిడ్లు త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా రాగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలలో కూడా రాగులు మనకు దోహదపడతాయి. నడి వయసు మహిళల్లో ఎముకలు పటుత్వం తగ్గుతూ ఉంటాయి.
రాగులు ఎముకలను ధృడంగా చేస్తాయి. నిద్రలేమి, వ్యాకులత, ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు రాగులను రోజూ తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రాగులను తీసుకోవడం వల్ల మనకు తగినంత అయోడిన్ లభిస్తుంది. రాగులతో చేసిన ఏ ఆహారాన్ని తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు కలుగుతుంది. రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రాగులను పిల్లలకు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. రాగులను వేయించి పిండిగా చేయాలి. ఈ రాగి పిండిని బియ్యంతో కలిపి వండుకుని తింటే నీరసం తగ్గుతుంది. రాగులతో మనం రుచిగా జావను కూడా తయారు చేసుకోవచ్చు.
రాగులతో మన శరీరానికి ఎంతో మేలు చేసే రాగి జావను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో కొద్దిగా నీటిని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఉండలు లేకుండా కలుపుకుని రాగి పిండిని వేసి పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి జావ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న రాగి జావను నేరుగా తాగవచ్చు లేదా దీనిలో మజ్జిగ, ఉప్పును వేసి కూడా తీసుకోవచ్చు.


ఈ విధంగా తీసుకోవడం వల్ల నీరసం, ఆందోళన తగ్గి తక్షణ శక్తి లభిస్తుంది.రాగి జావలో పంచదార, పాలను కూడా కలిపి తయారుచేయవచ్చు. ఇలా పాలు , పంచదార వేసి తయారు చేసిన రాగి జావను పిల్లలకు ఇస్తే వారిలో ఎముకలు ఎంతో పుష్టిగా తయారవుతాయి. వారి ఎదుగుదల కూడా బాగుంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. రాగులతో చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్య తగ్గుతుంది. రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.