ఏపీలో ట్రాఫిక్ చలాన్లపై ఊరట..! చంద్రబాబు కీలక ఆదేశాలు

పీలో హైకోర్టు ఆదేశాల తర్వాత గత కొంతకాలంగా వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల్ని దుమ్ముదులిపి అమలు చేయడం ప్రారంభించారు.


దీంతో పలు చోట్ల వేల రూపాయలు ఫైన్లు కడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను వివరించాలని సూచించారు. భారీ ఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను సీఎం సున్నితంగా తిరస్కరించారు. చలానాలు వేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు.

ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ముందుగా హెల్మెట్లు, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించడంతోపాటు… వారు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని వారి ఫోన్లకు మెసేజీలు పంపాలని సూచించారు. ఆ తర్వాత కూడా వారి నిబంధనలు ఉల్లంఘిస్తుంటే అప్పుడు చలానాలు వేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాను తప్పు చేసినందు వల్లే చలానాలు వచ్చాయనే భావన కలుగుతుందని చెప్పారు.

ఇందులో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇలాంటివి జరగ్గకుండా ఉండేలా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి… నిర్మాణత్మక ప్రణాళికను తయారు చేయాలని నిర్దేశించారు. దీనికి సంబంధించి ఎస్ఓపీలను సిద్దం చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏ మేరకు నియంత్రించగలమనే అంశాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు. అలాగే రూడ్లపై గుంతలు లేకుండా చూడాలన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.