RPF Jobs: టెన్త్‌, డిగ్రీ చదివితే చాలు.. రైల్వేలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇట్టే కొట్టేయొచ్చు

RPF Notification 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కోసం మరో భారీ ఉద్యోగ ప్రకటన వచ్చింది. మంచి జీతంతోపాటు హోదా ఉండే ఉద్యోగాల ప్రకటన వచ్చేసింది.
ఈ ఉద్యోగాల ఎంపికకు కావాల్సిన అర్హతలు, పరీక్ష ఫీజు, ఇతర నియమ నిబంధనలు ఏమిటో చదవండి.
నిరుద్యోగులకు భారతీయ రైల్వే నియామక బోర్డు (ఆర్‌ఆర్‌బీ) మరో ఉద్యోగ ప్రకటనతో ముందుకు వచ్చింది. గతంలోనే ఈ ఉద్యోగ ప్రకటనపై చిన్న ప్రకటన విడుదల చేయగా.. తాజాగా సమగ్ర వివరాలతో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. రైల్వే పోలీస్‌ దళం (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)లో ఈ ఉద్యోగాల నియామకాలను చేపట్టనుంది. మొత్తం 4,660 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వాటిలో 452 ఎస్సై పోస్టులు ఉండగా.. 4,208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాల భర్తీకి స్త్రీ, పురుషులు ఇరువురు అర్హులే. ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల భర్తీ-2024 కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విధానం 11 ఏప్రిల్‌ నుంచి 14 మే 2024 వరకు ఉంటుంది. ఈ ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థులు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు రాయాల్సి ఉంది. అందులో ఎంపికైతే పీఈటీ, మెఈటీ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌తో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఆర్‌ఆర్‌బీ అధికారిక https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. దరఖాస్తుల గడువు ప్రకటించినా పరీక్షల తేదీలు మాత్రం ప్రకటించలేదు. ఈ ఉద్యోగాల్లో మహిళలకు 15 శాతం రిజర్వ్‌ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది.


పూర్తి వివరాలు
ఉద్యోగం పేరు: ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌, ఎస్సైలు
మొత్తం ఎన్ని పోస్టులు: 4,660 (452 ఎస్సై పోస్టులు, 4,208 కానిస్టేబుల్‌)
వయసు: అభ్యర్థుల వయసు 1 జూలై 2024 నాటికి ఎస్సై పోస్టులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ప్రారంభ వేతనం: ఎస్సై ఉద్యోగాలకు రూ.35,400, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ, ఎక్స్‌ సర్వీస్‌ వారికి రూ.250, ఇతరులకు రూ.500.
దరఖాస్తు గడువు: 15 ఏప్రిల్‌ 2024 దరఖాస్తులు ప్రారంభమై 14 మే 2024న ముగుస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో (https://indianrailways.gov.in/)