ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9 కోట్లు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు


ఈనాడు, దిల్లీ: బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు మంగళవారం జస్టిస్‌ సంజయ్‌కరోల్, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. లక్ష్మి నాగళ్ల అనే మహిళ 2009 జూన్‌ 13న భర్త, ఇద్దరు కుమార్తెలతో కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందారు. అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని, ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాద్‌ నాగళ్ల సికింద్రాబాద్‌ మోటార్‌ యాక్సిడెంట్స్‌ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.

వాదనలు విన్న ట్రైబ్యునల్‌ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. రూ.5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా.. రూ.9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది.