భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిందని ఇటివల పలు రకాల కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి రూమర్స్ అని కూడా మరికొన్ని కామెంట్స్ వినిపించాయి.
అయితే ఎట్టకేలకు సచిన్ అధికారికంగా ధృవీకరించారు. ఇంతకాలం ఊహాగానాలుగా మారిన ఈ విషయంపై ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ నోటి నుంచి క్లారిటీ రావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్తో ఈ నెల 13న ప్రైవేట్ వేడుకలో ఉంగరాలు మార్చుకున్నాడని సమాచారం. సోషల్ మీడియా రెడిట్ లో జరిగిన ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో ఒక ఫ్యాన్ నేరుగా సచిన్ను అడిగాడు. “అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిందా?” అని. దీనికి సచిన్ స్పందిస్తూ, “అవును, అతనికి నిశ్చితార్థం జరిగింది. మేమంతా అతడి కొత్త ప్రయాణంపై చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం” అని చెప్పారు. దీంతో ఊహాగానాలకు తెరపడింది.
అర్జున్ 25 ఏళ్ల వయసులో గోవా తరఫున దేశీయ క్రికెట్ లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సానియా చందోక్ వయసు 26 ఏళ్లు. ఆమె బాస్కిన్ రాబిన్స్ ఇండియా ఫ్రాంచైజీని నడిపే గ్రావిస్ గ్రూప్ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. ఈ గ్రూప్ దేశంలోని ఫుడ్, హాస్పిటాలిటీ రంగాల్లో కీలక స్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.624 కోట్ల టర్నోవర్ సాధించింది.
నిశ్చితార్థ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అర్జున్, సానియా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా.. అభిమానులు ఇప్పటికే శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.
































