వైఎస్సార్సీపీ కీలక నేత (YSRCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Ex MLA Vallabhaneni Vamsi) చుట్టు ఉచ్చు బిగిస్తోంది. పోలీసులు (Police) పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3 (5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. వంశీని హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్టుమెంట్లో అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు. వంశీ అరెస్టులో ఏపీ పోలీసులు రాయదుర్గం పోలీసుల సహాయం తీసుకున్నారు.
అనుచిత వ్యాఖ్యల కేసు..
కాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 7నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేవలకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వంశీ గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్టు కాకుండా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే గురువారం హైదరాబాద్, రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తనకు ముందస్తు బెయిల్ ఉందని.. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇది వేరే కేసు అని చెప్పి పోలీసులు వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువస్తున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతలు ఆయనపై కేసులు నమోదు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈనేపథ్యంలో పోలీసులు వంశీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
వంశీపై సత్యవర్ధన్ కుటుంబం సభ్యులు ఫిర్యాదు..
మరోవైపు గన్నవరంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. రామవరప్పాడు ప్రాంతంలో సత్యవర్దన్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు గత రాత్రి విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పేర్కొన్నారు.