ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన.. బాలికల వాష్ రూంలో కెమెరా

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికల వాష్‌రూమ్‌లో అటెండర్ యాకూబ్ పాషా గోప్యంగా కెమెరా అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు బాలికలు గుర్తించారు.


వాష్‌రూమ్‌లో కెమెరా అనుమానాస్పదంగా మెరుస్తుడడంతో గమనించిన కొందరు బాలికలు, తమ తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాలహెడ్మాస్టర్ పై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగాధర ఎస్‌ఐ వంశీ కృష్ణ, సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి, వాష్ రూమ్ నుంచి కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

“కొంతమంది పిల్లలు అటెండర్ వలన ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. పిల్లలు ఆ ఇబ్బందికి సంబంధించిన నివేదికను తయారు చేసుకున్నారు. ఆ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.” అని గంగాధర ఎంఈఓ ప్రభాకర్ రావు తెలిపారు. పాఠశాలలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, స్నేహిత, సఖీ టీమ్ ద్వారా ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న అమ్మాయిలందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. ఏదైనా ఇబ్బంది పడితే చెప్పడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని, జిల్లా కలెక్టర్ వీటిని ఆర్గనైజ్ చేస్తున్నారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సఖీ కేంద్రం వారు కూడా తమ నివేదిక తయారుచేసి ఉన్నత అధికారులకు సమర్పిస్తారు.ఉన్నతాధికారులు చెప్పిన విధంగా తాము నడుచుకుంటామని తెలిపారు.

ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల అటెండర్ యాకూబ్ పాషా, విద్యార్థినుల ఫోటోలు తీసి అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు మధురానగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించాయి. నిందితుడిని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గంటసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఘటనపై స్పందించిన బండి సంజయ్:

గంగాధరలోని పాఠశాల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్స్పందించారు. టాయిలెట్లలో కెమెరాలు పెట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డ వైనంపై కరీంనగర్ రూరల్ ఏసీపీతో బండి సంజయ్ మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.