మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ – ఆ జట్లలో దేని అవకాశాలు ఎలా ఉన్నాయి?

www.mannamweb.com


ఐపీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ కథ కూడా ముగిసింది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ నెలకొంది. మరి ఆ జట్లలో దేని అవకాశాలు ఎలా ఉన్నాయి?

రాజస్థాన్‌ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లోనే 8 నెగ్గింది. కానీ తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. అయినప్పటికీ రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేనట్లే. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. ఆ జట్టుకు బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం ఆ జట్టు సొంతమవుతుంది. పంజాబ్‌, కోల్‌కతాలతో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాయల్స్‌ ముందంజ వేస్తుంది. కాకపోతే ఆ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితే ఇప్పుడున్న 16 పాయింట్లతోనే ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది.

రాజస్థాన్‌ తర్వాత మెరుగైన అవకాశాలున్నది హైదరాబాద్‌కే. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌, పంజాబ్‌) గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. నెట్‌రన్‌రేట్‌ బాగుంది (+0.406) కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేయొచ్చు. రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (+0.528) చాలా మెరుగ్గా ఉంది కాబట్టి వేరే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం కావచ్చు.
లఖ్‌నవూ, దిల్లీ చెరో 6 విజయాలు సాధించాయి. ఆ రెండు జట్లూ నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డాయి. లఖ్‌నవూ.. దిల్లీ, ముంబయిలతో తలపడాల్సి ఉంది. లఖ్‌నవూ చేతిలో దిల్లీ ఓడితే ఆ జట్టు కథ ముగుస్తుంది. ఎందుకంటే అదే ఆ జట్టుకు చివరి మ్యాచ్‌. దిల్లీ చేతిలో లఖ్‌నవూ ఓడితే ఆ జట్టు కథ కూడా దాదాపు ముగిసినట్లే. ఎందుకంటే ఎల్‌ఎస్‌జీ నెట్‌రన్‌రేట్‌ (-0.769) ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయం సాధించినా ముందంజ వేయడం కష్టమే.
తొలి 8 మ్యాచ్‌ల్లో 7 ఓడి ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైనట్లు కనిపించిన బెంగళూరు.. అనూహ్యంగా తర్వాతి 5 మ్యాచ్‌ల్లోనూ నెగ్గి రేసులోకి వచ్చింది. ఆ జట్టుకు సమీకరణాలు కలిసి వస్తే ముందంజ వేయొచ్చు. నెట్‌రన్‌రేట్‌ (+0.387) మెరుగ్గా ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. హైదరాబాద్‌, దిల్లీ, లఖ్‌నవూ జట్లలో ఒక్కటే ముందంజ వేసి, రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నై-బెంగళూరు మ్యాచ్‌ నాకౌట్‌గా మారుతుంది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేస్తే 18 పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే.. చెన్నైని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌ చేరుతుంది.