మాజీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా.. తేల్చేసిన స్పీకర్?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ(AP Assembly)లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyanna Patrudu) తెలిపారు.


జగన్‌(Former CM Jagan) పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ప్రతిపక్షనేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నేడు(సోమవారం) ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా కోసం మాజీ సీఎం జగన్‌ చేస్తున్న పోరాటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అసాధ్యమని కుండబద్దలు కొట్టేశారు. అసెంబ్లీ నియమాలు, నిబంధనలను జగన్‌ తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమ నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడాలని సూచించారు.

స్పీకర్‌ గా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని.. తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదన్నారు. అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చు. ఫలానా కారణం వల్ల సభకు రాలేకపోతున్నానని స్పీకర్ కు లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి కామెంట్స్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.