రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 30వ తేదీ వరకు ఈ క్యాంపుల ద్వారా సేవలను పొందవచ్చు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు వారి కార్డులను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. వీరి సంఖ్య 8 లక్షలకుపైగానే ఉంది. ఇక 15 ఏళ్ల పైబడిన వారు మరో 7 లక్షల మందికిపైగా ఉంటారని లెక్కలు చెబుతచున్నాయి. కాబట్టి వీరంతా వారి పాత ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
- చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి.
- పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్కు తీసుకెళ్లాలి.
- చిన్నారులను ఆధార్ సెంటర్కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి.
- ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డును తీసుకుని ఉంటే.. వారికి 7 సంవత్సరాల వయస్సులోపు బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయాలని, లేదంటే వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేయవచ్చని యూఐడీఏఐ ఇటీవల ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా జారీ చేసింది. కాబట్టి ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు.
































