ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ తరుణంలో P-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. ఇటీవల ఉగాది నుంచి పీ-4 విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా పీ-4లో ఉన్న వారికి చేయూత ఇస్తామని చెప్పారు.
మొదటగా నాలుగు గ్రామాల్లో P-4 విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 16 జిల్లాల్లో నిన్నటి(శనివారం) నుంచి సర్వే మొదలైంది. ఈ సర్వేను మార్చి 18వ తేదీ వరకు పూర్తి చేయాలి. 21 నుంచి 23 వరకు గ్రామాల వారీగా సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఉగాది రోజు P-4 కార్యక్రమ వివరాలను ప్రకటిస్తారు. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది.
సర్వేలో అడిగే ప్రశ్నలివే!
*ఇంటి యజమాని పేరు
*ఆధార్(Aadhaar), ఫోన్ నంబర్(Phone Number)
*కుటుంబ సభ్యుల వివరాలు
*ఇంట్లో సంపాదన పరులు ఎందరు?
*ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?
*ఇల్లు ఏ రకం?
*బ్యాంకు ఖాతా వివరాలు
*పట్టణాల్లో స్థలం ఉందా?
*నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది.
*గత రెండేళ్లలో ఆదాయపు పన్ను చెల్లించారా?
*టీవీ(TV), ఫ్రీజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
































