తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణానది, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుందంటూ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అభ్యంతరం తెలిపలేదని.. వృధా నీటిని ఉపయోగించుకుంటున్నామని వివరించారు.


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య జల వివాదం తారాస్థాయికి చేరింది.. కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ తెలంగాణ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.. ఏపీ సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకువచ్చిన బనకచర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి అభ్యంతరం చెప్పడం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ సీఎం అభ్యంతరం తెలపడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. వృధా నీటితో బనకచర్ల కడితే నష్టమేంటని.. కాళేశ్వరం కడితే తాము అభ్యంతరం తెలిపామా..? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.. నీరు వృధా కాకుండా మీరూ ప్రాజెక్ట్‌లు కట్టుకోండి అంటూ సూచించారు.. సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని.. కరువు ప్రాంతాలకు తరలిస్తే బాధపడొద్దు.. అంటూ చంద్రబాబు సూచించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల లింక్ ప‌థ‌కానికి రూప‌క‌ల్పన చేసిందని రేవంత్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌శ‌‌‌‌‌‌‌‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌‌‌‌‌కు కంప్లయింట్​ చేసిన కొన్ని గంటల్లోనే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించడం చర్చనీయాంశంగా మారింది.. ఈ వివాదంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

భారీ మెజార్టీతో గెలవడం సరికొత్త చరిత్ర..
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం సరికొత్త చరిత్ర అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని మొత్తం ఐదు పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా టీడీపీ వాళ్లే ఉండటం సరికొత్త రికార్డ్ అన్నారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో జరిగిన ఎమ్మెల్సీల విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ గెలుపుతో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్‌ సహా అనేక హామీలు ఇచ్చామని.. కానీ ఖజానా చూస్తే దిక్కుతోచని పరిస్థితి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే తల్లి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు.